మీనాక్షీ నటరాజన్కు ఊరట.. ఆమెపై దాఖలైన పిటిషన్ను వెనక్కి పంపిన కోర్టు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్కు ఊరట లభించింది. ఆమెను ప్రతివాదిగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను నాంపల్లిలోని కోర్టు విచారణకు స్వీకరించకుండా వెనక్కి పంపింది. ఈ పరిణామం ఇటీవల రాజ్యసభ నామినేషన్ వివాదంలో చిక్కుకున్న మీనాక్షీ నటరాజన్కు ఉపశమనం కలిగించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాదులు, ఈ కేసులో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నందున సాధారణ మెజిస్ట్రేట్ కోర్టుకు విచారణ అధికార పరిధి లేదని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు, ఈ అంశాన్ని సంబంధిత ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలు చేసుకోవచ్చని సూచిస్తూ పిటిషన్ను తిరిగి ఇచ్చింది.
ఈ కేసు కారణంగానే ఇటీవల మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే వాదిస్తోంది.
పిటిషనర్ మాత్రం తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తానని, తగిన కోర్టును ఆశ్రయించి మళ్లీ పిటిషన్ దాఖలు చేస్తానని వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం పూర్తిగా ముగిసినట్లు కాకపోయినా, ప్రస్తుతం మీనాక్షీ నటరాజన్కు తాత్కాలిక ఊరట లభించినట్లైంది.
