సిరిసిల్లలో పానీపూరి ఘటనపై కేటీఆర్ ఆందోళన.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్లో పానీపూరి తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను వైద్యులు, అధికారులు, స్థానిక నాయకులను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు.
పానీపూరి తిన్న అనంతరం 12 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు కేటీఆర్కు వివరించారు. ప్రస్తుతం బాధితులందరికీ చికిత్స అందుతున్నదని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకుని కేటీఆర్ ఊరట వ్యక్తం చేసినట్లు సమాచారం.
బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో పాటు పార్టీ నాయకులకు కేటీఆర్ సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రజలు ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా పిల్లలు బయట విక్రయించే ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, పరిశుభ్రత లేని ఆహార పదార్థాలను నివారించాలని కోరారు.
