తుంగభద్ర వద్ద ముగ్గురు సీఎంల రహస్య భేటీ.. గంటపాటు గోప్యంగా చర్చలు
హైదరాబాద్: కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తుంగభద్ర ప్రాంతంలో గంటపాటు రహస్యంగా సమావేశమైన ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులను అనుమతించకుండా పూర్తిగా గోప్యంగా చర్చలు నిర్వహించినట్లు సమాచారం.
తుంగభద్ర డ్యామ్కు కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ముందు జరిగిన ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టు, అంతర్రాష్ట్ర నీటి పంపిణీ వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే సమావేశం అనంతరం ఏ అంశాలపై ఏ నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
సమావేశం అనంతరం ఇది చారిత్రాత్మక భేటీ అని నేతలు పేర్కొన్నప్పటికీ, చర్చల వివరాలు గోప్యంగానే ఉంచడం పలు ప్రశ్నలకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసిన జలవివాదాల ఎజెండాలోని అనేక అంశాలు సమావేశంలో ప్రస్తావనకు రాలేదని వార్తలు వెలువడ్డాయి.
ఈ రహస్య సమావేశం నేపథ్యంలో అంతర్రాష్ట్ర జల ఒప్పందాలు, భవిష్యత్ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని రాజకీయ, సాగునీటి వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
