అజయ్ దేవ్గన్ ‘చౌహాన్’ సినిమాపై వివాదం.. క్షత్రియ పరిషత్ అభ్యంతరం
ముంబై: బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘చౌహాన్’ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన టీజర్పై క్షత్రియ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాజ్పుత్ చరిత్రను సమకాలీన రాజకీయ కథనాలతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.
క్షత్రియ పరిషత్ విడుదల చేసిన ప్రకటనలో, చౌహాన్ వంశ చరిత్రను రాజకీయ లేదా సిద్ధాంతపరమైన ప్రయోజనాల కోసం వినియోగించరాదని పేర్కొంది. రాజ్పుత్ వారసత్వం చారిత్రకమైనదని, దానిని వివాదాలకు లేదా రాజకీయ ప్రచారాలకు ఉపయోగించడం తగదని అభిప్రాయపడింది.
మరోవైపు, సినిమా టీజర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ఈ అభ్యంతరాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు సినిమా విడుదలకు ముందే విమర్శించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.
దర్శకుడు నీరజ్ యాదవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా, తాజా వివాదం నేపథ్యంలో చిత్రబృందం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
