ఒకే ఏడాదిలో 6 కోట్ల ఓటర్ల పేర్ల తొలగింపు.. ‘ఎస్ఐఆర్’పై దేశవ్యాప్తంగా చర్చ
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు ఏడాది పూర్తయిన సందర్భంగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ప్రక్రియలో దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ ప్రక్రియలో మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రత్యేక సవరణ ప్రారంభమవగా, అక్కడే సుమారు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడినట్లు వెల్లడైంది.
ఇదిలా ఉండగా, ఎన్సీఈఆర్టీ రూపొందించిన కొత్త 9వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యాంశంలో కూడా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశాన్ని చేర్చారు. అర్హులైన ఓటర్లు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ అంశాన్ని పాఠ్యాంశంలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
