కూతురు మృతికి ప్రతీకారం.. అల్లుడి హత్యకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చిన అత్త
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తన కుమార్తె మరణానికి అల్లుడే కారణమని భావించిన ఓ మహిళ, అతడిని హత్య చేయించేందుకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన అత్తతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గారెపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి కుమార్తె సంధ్యకు 2017లో గణేశ్తో వివాహం జరిగింది. అదనపు కట్నం వివాదాల నేపథ్యంలో 2023లో సంధ్య హత్యకు గురైంది. ఈ కేసులో గణేశ్ జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్పై విడుదల కావడంతో అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని రాజేశ్వరి నిర్ణయించింది. ఇందుకోసం ఓ వ్యక్తి ద్వారా రూ.10 లక్షలకు సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర పన్నింది.
ఈ నెల 23న గణేశ్పై దాడి చేయడానికి నిందితులు పథకం ప్రకారం అతడిని ఒంటరిగా పిలిచి కత్తులతో దాడి చేశారు. అయితే గణేశ్ కేకలు వేయడంతో సమీపంలోని రైతులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. అనంతరం మిగిలిన సుపారీ డబ్బుల కోసం సమావేశమైన సమయంలో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
