కేటీఆర్పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ ఉపేంద్ర, కాల్వ నితీష్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇతర రాజకీయ పార్టీల నాయకులపై చిన్న వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, కేటీఆర్పై జరుగుతున్న వ్యక్తిగత దాడుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ భేదాలు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో ద్వేషపూరిత ప్రచారం, వ్యక్తిగత దూషణలు పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
