‘మంత్రి 30 శాతం’ కథనంతో దుమారం.. హైడ్రా తీరుపై కొత్త చర్చ
హైదరాబాద్: ఈదులకుంట భూముల వ్యవహారంపై ప్రచురితమైన ‘మంత్రి 30 శాతం’ కథనం తెలంగాణ రాజకీయాల్లో, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కథనం వెలువడిన అనంతరం హైడ్రా స్పందిస్తూ తమ చర్యలపై వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైడ్రా ప్రైవేట్ భూముల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈదులకుంట భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఈ భూముల విషయంలో జోక్యం చేసుకోబోమని కోర్టుకు తెలిపిన హైడ్రా, ఇప్పుడు అప్పీల్కు వెళ్లనున్నట్లు ప్రకటించడం పలు ప్రశ్నలకు దారితీసింది.
భూమి రికార్డులు, సర్వే మ్యాపులు, శాటిలైట్ చిత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఈదులకుంట చెరువును పరిరక్షించే చర్యలు చేపట్టామని హైడ్రా వెల్లడించింది. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, అనంతరం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అయితే ఈ వ్యవహారంలో మంత్రి ప్రమేయంపై వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వం గానీ, హైడ్రా గానీ ఇప్పటివరకు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. మరోవైపు కోర్టు వివాదాల్లో ఉన్న భూముల విషయంలో హైడ్రా అనుసరిస్తున్న విధానంపై బాధితులు, న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
