రూ.2,041 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్.. బహిరంగ చర్చకు సవాల్
హైదరాబాద్: తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సరఫరా చేసే వస్తువుల కొనుగోళ్లలో రూ.2,041 కోట్ల మేర అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.
హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెసిడెన్షియల్ పాఠశాలలకు ట్రంక్ బాక్సులు, యూనిఫాంలు, నోట్బుక్స్ తదితర సామగ్రి కొనుగోళ్లలో టెండర్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కొన్ని సంస్థలకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి కాంట్రాక్టులు కట్టబెట్టారని విమర్శించారు.
ఈ వ్యవహారంపై జూలై 2న సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు సవాల్ విసిరారు. తాను చేస్తున్న ఆరోపణలకు అవసరమైన ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలాగే ఈ కొనుగోళ్లపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించి నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
