సస్పెండ్ తహసీల్దార్ సుచరితపై ఏసీబీ దాడులు.. రూ.50 కోట్లకుపైగా ఆస్తుల గుర్తింపు
హైదరాబాద్: శామీర్పేట్ మాజీ తహసీల్దార్, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆమె నివాసంతో పాటు బంధువులు, బినామీలు, అనుచరులకు చెందిన మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో రూ.12 లక్షల నగదు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, మూడు ఫ్లాట్లు, రెండు స్థలాలు, 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి, రెండు కార్లు, బ్యాంకు ఖాతాల్లో రూ.38 లక్షల నిల్వలను అధికారులు గుర్తించారు. పత్రాల ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.5.05 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్ విలువ రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
గతంలో భూమి వ్యవహారంలో రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసి, తొలి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా సుచరితను ఏసీబీ రెడ్హ్యాండెడ్గా అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్లో ఉండగా, తాజాగా అక్రమాస్తుల కేసులో కూడా విచారణ కొనసాగుతోంది. అధికారులు మరిన్ని ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
