పీవీ తెలంగాణ గర్వకారణం.. జయంతి సందర్భంగా కేటీఆర్ నివాళి
హైదరాబాద్: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన మహానేతగా, బహుభాషా కోవిదుడిగా, దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిగా పీవీ సేవలను కేటీఆర్ గుర్తు చేశారు.
దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో సమర్థవంతమైన నాయకత్వంతో భారత్ను ముందుకు నడిపించిన నాయకుడు పీవీ నరసింహారావు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నేలపై జన్మించిన పీవీ దేశానికే గర్వకారణమని, ఆయన వారసత్వం ప్రతి తెలంగాణవారికి స్ఫూర్తిదాయకమని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందని కేటీఆర్ గుర్తు చేశారు. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టడం, నెక్లెస్ రోడ్డుకు ‘పీవీ మార్గ్’గా నామకరణం చేయడం, హైదరాబాద్లో ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన సేవలకు ప్రభుత్వం గౌరవం తెలిపిందన్నారు.
పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, భావితరాలకు ఆయన ఆదర్శప్రాయ నాయకుడిగా నిలిచిపోతారని కేటీఆర్ పేర్కొన్నారు.
