పరీక్షల ఒత్తిడిలో తెలంగాణ విద్యార్థులే ముందంజ.. సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ నివేదికలో కీలక గణాంకాలు
హైదరాబాద్: పరీక్షల ఒత్తిడి, మానసిక ఆందోళనతో బాధపడుతున్న విద్యార్థుల సంఖ్యలో తెలంగాణ ముందంజలో ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్ఫోర్స్ మధ్యంతర నివేదిక వెల్లడించింది. 2024లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న టెలి-మనస్ (Tele-MANAS) మానసిక ఆరోగ్య హెల్ప్లైన్ను ఆశ్రయించిన 3.6 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు లక్ష మంది తెలంగాణకు చెందిన వారేనని నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో 30 నుంచి 40 వేల మంది విద్యార్థులు మాత్రమే ఈ సేవలను వినియోగించగా, తెలంగాణ నుంచి అత్యధికంగా కాల్స్ నమోదయ్యాయి. విద్యార్థుల్లో పరీక్షల భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితిని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని టాస్క్ఫోర్స్ అభిప్రాయపడింది.
అక్టోబర్ 2022 నుంచి అక్టోబర్ 2025 వరకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల 1.54 లక్షల మంది యువత టెలి-మనస్ సేవలను ఆశ్రయించగా, అందులో సుమారు 4 శాతం కాల్స్ ఆత్మహత్య ఆలోచనలకు సంబంధించినవిగా నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి విద్యాసంస్థల్లో మరింత బలమైన సహాయక వ్యవస్థలు అవసరమని టాస్క్ఫోర్స్ సూచించింది.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణకు సంబంధించి సమగ్ర సిఫార్సులు రూపొందించే పనిలో టాస్క్ఫోర్స్ కొనసాగుతోందని, విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ సేవలు, మానసిక ఆరోగ్య మద్దతు వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
