ఆదాయ సమీకరణపై ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆదాయ సమీకరణను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న ఆదాయం అమలులో ఉన్న పథకాలకే సరిపోతోందని, ఎన్నికల హామీలు సహా ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆదాయ వనరులను మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్ తదితర శాఖలు ఆదాయ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లీకేజీలను పూర్తిగా అరికట్టాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. శాఖల పనితీరును నిరంతరం సమీక్షిస్తూ లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను మరింత బలోపేతం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు సమకూర్చడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి. ఆదాయ సమీకరణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించినట్లు సమాచారం.
