చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. నెహ్రూ రికార్డుకు చెక్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా ఆయన కొత్త రికార్డు సృష్టించారు.
నేటితో ప్రధాని మోదీ 4,399 రోజుల పాటు ఎన్నికైన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును అధిగమించారు. దీంతో ఎన్నికల ద్వారా ప్రజల తీర్పుతో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా మోదీ చరిత్రలో నిలిచారు.
జవహర్లాల్ నెహ్రూ మొత్తం 6,130 రోజుల పాటు ప్రధానిగా పనిచేసినప్పటికీ, 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి 1952లో తొలి సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన ఎన్నిక కాకుండానే పదవిలో కొనసాగారు. తొలి సాధారణ ఎన్నికల అనంతరం మాత్రమే నెహ్రూ ప్రజల చేత ఎన్నికైన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, 2019లో రెండోసారి, 2024లో మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చారు. దీంతో ప్రజల మద్దతుతో నిరంతరాయంగా కొనసాగుతున్న ఆయన ప్రస్థానం భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు మోదీ సాధించిన ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా మోదీ నాయకత్వం దేశానికి కొత్త దిశను చూపిందని పేర్కొంటున్నారు.
ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రికార్డు ఒక ప్రత్యేక ఘట్టంగా నిలవనుండగా, ప్రధాని మోదీ రాజకీయ ప్రస్థానంలో ఇది మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
