భారత విమానయాన రంగానికి భారీ షాక్.. రూ.38 వేల కోట్ల వరకు నష్టాల అంచనా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన రంగం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ ఇక్రా (ICRA) హెచ్చరించింది. దేశీయ విమానయాన సంస్థలకు రూ.36 వేల కోట్ల నుంచి రూ.38 వేల కోట్ల వరకు నికర నష్టాలు వచ్చే అవకాశం ఉందని తాజా నివేదికలో వెల్లడించింది. ఈ అంచనా గతంలో పేర్కొన్న రూ.11-12 వేల కోట్ల నష్టం అంచనాతో పోలిస్తే మూడింతలకు పైగా పెరిగింది.
నివేదిక ప్రకారం, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, విమాన ఇంధనం (ATF) ధరలు పెరగడం, విమానాల లీజు అద్దెలు అధికమవడం, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్ల సంస్థలపై ఆర్థిక భారం మరింత పెరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభావం పడుతున్నట్లు ఇక్రా పేర్కొంది.
టికెట్ ధరలు పెరిగినా, పెరిగిన నిర్వహణ వ్యయాలను పూర్తిగా భర్తీ చేయడం విమానయాన సంస్థలకు కష్టంగా మారిందని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల వృద్ధి అంచనాలను కూడా ఇక్రా తగ్గించింది. దీంతో విమానయాన రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశముందని విశ్లేషించింది.
