రగ్బీ లీగ్ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. సీఎం పేరుకు బదులుగా మరో పేరు పలికిన రాహుల్ బోస్
హైదరాబాద్: గచ్చిబౌలిలో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు, రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుకు బదులుగా పొరపాటున మరో పేరు పలకడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాహుల్ బోస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని సంబోధించే క్రమంలో “హానరబుల్ చీఫ్ మినిస్టర్ చిరంజీవి గారు” అని పేర్కొన్నారు. వెంటనే తన పొరపాటును గుర్తించినప్పటికీ, అప్పటికే ఆ వీడియో నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, గతంలో కూడా పలు బహిరంగ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతలు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పొరపాటుగా పలికిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటన కూడా అదే జాబితాలో చేరడంతో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది.
