సీఎం నల్గొండ పర్యటనకు ముందు ఉద్రిక్తత.. పలువురు నేతలు, విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నల్గొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనకు ముందు పలుచోట్ల పోలీసులు ముందస్తు నిర్బంధాలకు దిగారు. బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి నాయకులతో పాటు ఓ కాంగ్రెస్ యువనేతను కూడా అదుపులోకి తీసుకోవడం జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసింది.
మిర్యాలగూడలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు సీఎం పర్యటనను నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారనే సమాచారంతో తెల్లవారుజామున పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, నియామకాల అంశంపై న్యాయ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
అదే సమయంలో నల్గొండ పట్టణంలో పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులను కూడా పోలీసులు నిర్బంధించారు. మరోవైపు మునుగోడులో కాంగ్రెస్ యువనేత జంగిలి నాగరాజును కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభలో ప్లకార్డులతో నిరసన తెలిపే అవకాశం ఉందనే సమాచారంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ నిర్బంధాలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. అయితే ప్రజా శాంతి, భద్రత దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.
