సీఎం నల్గొండ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం.. ప్రకటనల్లో గుత్తా ఫొటో లేకపోవడంపై అసంతృప్తి
నల్గొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ అంశం వివాదానికి దారితీసింది. సీఎం పర్యటనతో పాటు హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఆర్అండ్బీ శాఖ విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటనల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫొటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జిల్లాకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అయినప్పటికీ అధికారిక ప్రకటనల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరాలని, అవసరమైతే నోటీసులు జారీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో సీఎం పర్యటన ప్రోటోకాల్ జాబితాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పేరు లేకపోవడం, పార్టీ ఫ్లెక్సీల్లోనూ ఆయన ఫొటో కనిపించకపోవడం మరో చర్చకు దారితీసింది. అలాగే మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ నేత అనుచరుడిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది.
