ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావన.. స్పందించిన నటుడు
బెంగళూరు: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లో తన పేరు ప్రస్తావించడంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని తెలిపారు.
కర్ణాటక హైకోర్టులో దాఖలైన పిటిషన్లో కొందరు వ్యక్తులు తనపై ఆరోపణలు చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ధర్మస్థల అంశం కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన విషయం అని పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను బయట ప్రాంతంలో ఉన్నానని, మరో రెండు రోజుల్లో స్వయంగా మీడియా ఎదుట హాజరై అన్ని విషయాలపై స్పష్టత ఇస్తానని తెలిపారు. అప్పటి వరకు తనపై వస్తున్న ఊహాగానాలు, నిర్ధారణ కాని ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు స్వీకరించి తదుపరి విచారణను వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన ఆరోపణలు, వాస్తవాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
