హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, ఆయన సతీమణి ప్రియాంక దత్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నాగ్ అశ్విన్ షేర్ చేసిన ఫొటోలో గర్భవతిగా ఉన్న ప్రియాంక దత్ కనిపించగా, ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్గా మారింది. పలువురు సినీ ప్రముఖులు ఈ దంపతులకు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
దర్శకుడిగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఈ శుభవార్తతో ఆయన కుటుంబంలో ఆనందం రెట్టింపైంది.
2015లో నాగ్ అశ్విన్, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ను వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఈ దంపతులకు ఒక కుమారుడు ఉండగా, ఇప్పుడు రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు.
