తూప్రాన్లో ఘోరం
పురాతన ఆలయాలపై దుండగుల దాడి..
విగ్రహాల ధ్వంసం, నగలు చోరీ!
తూప్రాన్, మే:30 (ఆశ్వి అప్డేట్స్ )
తూప్రాన్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి వేళ ఘోర కలకలం రేగింది. గుర్తుతెలియని దుండగులు పట్టణంలోని పురాతన, చారిత్రక కూర్మ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై పడి వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఆలయ ప్రధాన గేట్లను బద్దలు కొట్టిన దుండగులు, లోపలికి చొరబడి స్వామివారి మూలవిరాట్టును (మూలా మూర్తిని) కింద పడేశారు. అంతటితో ఆగకుండా, ఆలయ ప్రాంగణంలోని రామానుజల విగ్రహాన్ని సైతం తీవ్రంగా ధ్వంసం చేశారు. గర్భగుడిలోని పూజా వస్తువులను, దైవ సామాగ్రిని ఇష్టమొచ్చినట్టు చిందరవందరగా పారేశారు.
*మరో ఆలయంలోనూ దొంగతనం*
కూర్మ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధ్వంసానికి పాల్పడిన అనంతరం, దుండగులు దానికి సమీపంలోనే నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆ ఆలయ తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, అమ్మవారి ఒంటిపై ఉన్న పుస్తెలు, మట్టెలను దొంగిలించుకెళ్లారు.
*పోలీసులకు ఫిర్యాదు-హిందూ సంఘాల ఆగ్రహం*
ఉదయాన్నే ఆలయానికి వచ్చిన అర్చకులు, నిర్వాహకులు ఈ ఘోర వినాశనాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి, ఫిర్యాదు చేశారు.
పురాతన దేవాలయాలపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత విచారకరం. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ దుండగులను వదిలిపెట్ట కూడదంటూ
స్థానిక భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన దేవాలయాలపై దాడికి పాల్పడి, విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు.
