తెలంగాణ భవన్లో చర్చకు వస్తా.. కేటీఆర్కు మంత్రి జూపల్లి ప్రతి సవాల్
హైదరాబాద్: రాష్ట్ర అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్కు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతి సవాల్ విసిరారు. తాను గురువారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్కు వచ్చి చర్చకు సిద్ధంగా ఉంటానని ప్రకటించారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపైనా బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. ఇందుకోసం తెలంగాణ భవన్లోనే చర్చ నిర్వహిద్దామని ప్రతిపాదించారు.
మంత్రి సవాల్ను బీఆర్ఎస్ నాయకులు స్వీకరిస్తూ తెలంగాణ భవన్లో చర్చకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలు, ఆర్బీఐ గణాంకాలు, అధికారిక లెక్కలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్, హరీశ్రావు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ భవన్, గన్పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
