మహిళల ఖాతాల్లో రూ.1.5 లక్షలు వేస్తే రాజకీయాలు వదిలేస్తా.. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్: మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ హామీ ప్రకారం రాష్ట్రంలోని ప్రతి అర్హ మహిళ ఖాతాలో రూ.1.5 లక్షలు జమ చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
పరిగిలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాల అమలులోనూ ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమికి అక్రమ ఓట్లే కారణమని పేర్కొంటూ, పార్టీ శ్రేణులు ఓటర్ల జాబితాల పరిశీలనలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కు అవకాశం ఇస్తారని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
